పవర్‌ఫుల్ సిస్టంగా ‘హైడ్రా’.. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) వ్యవస్థ ఉనికిలోకి రానున్నది.

Update: 2024-07-13 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) వ్యవస్థ ఉనికిలోకి రానున్నది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులతో పాటు నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమంగా వెలిసిన నిర్మాణాలు కూల్చివేయడం, ఆక్రమణలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొచ్చిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తీసేయడం వంటివన్నీ ఇప్పుడు హైడ్రా చేపట్టనున్నది. హైదరాబాద్ సిటీ మొదలు ఔటర్ రింగు రోడ్డు వరకు సుమారు 2,000 చదరపు కి.మీ. మేర ఉన్న ప్రాంతమంతా దీని పరిధిలోకి రానున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీస్, సిటీ పోలీస్, విజిలెన్స్, విద్యుత్ తదితర పలు విభాగాల సమన్వయంతో ఈ కొత్త వ్యవస్థ పని చేయనున్నది.

మెరుగైన సేవలు : సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ నగర ప్రజల అవసరాలు, వారికి మెరుగైన సేవలందించేందుకు వీలుగా ‘హైడ్రా’ పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన సీఎం.. దీని ఫంక్షనింగ్, నిర్వహణా వ్యవస్థ, సిబ్బంది సంఖ్య, విధివిధానాలు తదితరాలపై లోతుగా అధ్యయనం చేసి ముసాయిదా నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలను వివరించి భవిష్యత్తులో ఎలా పనిచేయనున్నదో దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ మొదలు విద్యుత్ శాఖ వరకు అనేక విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా పని చేసేలా ఉండాలని నొక్కిచెప్పారు. ఇప్పుడున్న ఈవీడీఎం విభాగాన్ని దానికి అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని వివరించారు.

రెండు వేల చ.కి.మీ. పరిధిలో హైడ్రా పని

‘హైడ్రా’ విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంత మంది సిబ్బంది ఉండాలి.. ఏయే విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకోవాలి.. ఎక్కడెక్కడ జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు నిత్యం కనెక్టివిటీలో ఉండేందుకు అనుసరించాల్సిన విధానం... తదితర అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2 వేల చ.కి.మీ. పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, ఆ పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు. హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని అవసరాన్ని బట్టి పరిశీలించాలని, ఈ నెల చివరలో జరిగే అసెంబ్లీ సెషన్‌లోపే ముసాయిదా తయారు కావాలని సీఎం ఆఫీసర్లకు ఆదేశించారు.

కీలకంగా వ్యవహరించేలా విధుల అప్పగింత

విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగులు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సప్లై తదితర అంశాలపైనా ‘హైడ్రా’ కీలకంగా వ్యవహరించేలా విధుల అప్పగింత ఉంటుందని సీఎం క్లారిటీ ఇచ్చారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య నిత్యం సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కనిపిస్తున్న అనధికారిక హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగింపుతో పాటు జరిమానా వసూలు బాధ్యతనూ హైడ్రాకు బదలాయించాలన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News