తిరుపతి లడ్డు వివాదంపై వీహెచ్ దీక్ష

తిరుపతి లడ్డుపై సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు

Update: 2024-09-24 10:45 GMT

దిశ, హిమాయత్ నగర్ : తిరుపతి లడ్డుపై సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారని మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం హిమాయత్ నగర్ లోని టీటీడీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దీక్ష కు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తిరుమలలో జరుగుతున్న ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ప్రపంచంలోనే వెంకన్న లడ్డుకు పవిత్రత ఉంటుందని పేర్కొన్నారు.

అలాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలపడం దారుణం అన్నారు. ప్రపంచ దేశాల్లో వెంకన్న భక్తులు ఉన్నారని తెలిపారు. గతంలో వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని.. తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను చేస్తున్న దీక్ష తో అయిన కేంద్ర ప్రభుత్వంలో చలనం రావాలన్నారు. ఈ సమస్య తొందరగా పరిష్కరించాలి. లేకపోతే ప్రజల్లో గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడటం దౌర్భాగ్యం అన్నారు. సీబీఐ ఎంక్వైరీ త్వరగా చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.


Similar News