Durgancheruvu: దుర్గం చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమించిన యువతి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పలేక, ప్రియురాలిని వెయిట్ చేయించలేక మానసిక ఒత్తిడితో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-07-27 04:04 GMT

దిశ, శేరిలింగంపల్లి: ప్రేమించిన యువతి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పలేక, ప్రియురాలిని వెయిట్ చేయించలేక మానసిక ఒత్తిడితో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ముషీరాబాద్ కు చెందిన బాలాజీ (25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 24న ఉదయం ఆఫీస్ కు వచ్చాడు బాలాజీ. అయితే అర్ధరాత్రి అయిన బాలాజీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు బాలాజీకి ఫోన్ చేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో స్నేహితులను విచారించారు. అయినా బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఈనెల 25వ తేదిన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఐటీ కంపెనీలో విచారించగా 24వ తేదీ రాత్రి 8:30 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి కిందికి దూకి నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి సిబ్బంది సహాయంతో పోలీసులు దుర్గం చెరువులో గాలిస్తుండగా శుక్రవారం సాయంత్రం నీటిలో బాలాజీ మృతదేహం లభ్యం అయింది. మెడలో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా మృతుడు బాలాజీగా గుర్తించారు. బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతి పెళ్లి కోసం ఒత్తిడి చెయ్యగా ప్రేమ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక బాలాజీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News