Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. పార్కింగ్ ఫీజుపై కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్‌టీ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-09-30 13:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్అండ్‌టీ యాజమాన్యం షాకింగ్ న్యూస్ చెప్పింది. నాగోల్, మియాపూర్‌ స్టేషన్ల వద్ద వాహనాల ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తేస్తూ మరోసారి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 6 ( ఆదివారం) నుంచి నాగోల్, మియాపూర్‌ మెట్రో పార్కింగ్ వద్ద చార్జీలు వసూలు చేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కాగా, గతంలో ఆగస్టు 14 నుంచి నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపోల వద్ద ఉన్న ఉచిత పార్కింగ్‌ను ఎత్తివేసి పార్కింగ్‌ ఫీజులను వసూలు చేయనున్నట్టు చెప్పడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మహాధర్నాకు సైతం ప్రయాణికులు పిలుపునిచ్చారు. దీంతో పార్కింగ్ ఫీజు వసూలు విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గింది. తాజాగా మరోసారి నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మరోసారి యాజమాన్యం నిర్ణయంపై మెట్రో ప్రయాణికులు ఫైర్ అవుతున్నారు.


Similar News