రూ.2 లక్షల హషీస్ అయిల్, ఓజీ గంజాయి పట్టివేత
హాషీష్ ఆయిల్, గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
దిశ, శేరిలింగంపల్లి : హాషీష్ ఆయిల్, గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుండి 285 గ్రాముల హషీష్ ఆయిల్, 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్ ఉపాధ్యాయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. పులిపాక హస్తోష్ ట్యాటు అర్టిస్టు. వీరిద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ గతంలో గంజాయి అమ్మకాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి గంజాయికి బదులు హషీష్ అయిల్, ఓజీ గంజాయి ( మాములు గంజాయి కంటే పదిరేట్ల అధిక పవర్ కలిగిన విదేశీ గంజాయి)కి అలవాటు పడ్డారు. ఇద్దరు కూడా గంజాయి వ్యసనపరులు. గంజాయి కొనుగోలు, అమ్మకాలు చేయడంతో ఇద్దరిపై గతంలో రెండేసి కేసులు ఉన్నాయి.
కొంత కాలంగా గంజాయికి దూరంగా ఉన్నారు. కానీ మళ్లీ ఈ మధ్య గంజాయికి బదులు ఓజీ గంజాయి, హషీష్ అయిల్ కు అలవాటు పడ్డారు. అలాగే అమ్మకందార్లుగా మారి పోలీసులకు పట్టుబడ్డారు. ప్రేమ్ ఉపాధ్యాయ్, పులిపాక హష్ తోష్ లకు బెంగూళూరుకు చెందిన షేక్ సబ్కీ హుస్సేన్ ( బిట్టు) అనే వ్యక్తి హషీష్, ఓజీ గంజాయిని సరపరా చేస్తున్నాడు. అతని వద్ద నుంచి వీరు గ్రాముకు రూ. 1000కి కొనుగోలు చేసి రూ. 2500 నుంచి రూ. 3000లకు అమ్మకాలు జరుపుతున్నారు. ఇలా గంజాయి అమ్మకాలు జరుపుతున్న సమయంలో గచ్చిబౌలి రోడ్డులో శనివారం ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి 285 గ్రాముల హషీష్ అయిల్, 20 గ్రాముల ఓజీ గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకన్న గంజాయి విలువ రూ.రెండు లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రేమ్ ఉపాధ్యాయ్, పులిపాక హష్ తోష్ లను అరెస్ట్ చేయగా బెంగూళూరుకు చెందిన షేక్ సబ్కీ హుస్సేన్ ( బిట్టు) పరారీలో ఉన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్న ఎస్టీఎఫ్ టీమ్ లో సీఐ ఎంపిఆర్ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు బి. భాస్కర్రెడ్డి, అజీమ్, శ్రీధర్, కానిస్టేబుళ్లు ప్రకాష్, రాకేష్, మహేష్, ప్రభులు ఉన్నారు.