Ranganath: ఆ భవనాలు కూల్చం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: కొంతకాలంగా హైదరాబాద్(Hyderabad)లో హైడ్రా(Hydra) పేరు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అనుమతులు లేని భవనాలను కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. దీంతో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉక్కుపాదం మోపారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, కాలువ వెంట అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా మూసీ నది(Musi River) వెంట ఉన్న కట్టడాలను కూడా కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చర్యలు కొనసాగుతున్నాయి. పేదలకు అన్యాయం జరుగకుండా ఎవరైనా ఇళ్లు కోల్పోతారో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు(Double Bedroom Houses) కేటాయిస్తున్నారు.
అయితే హైడ్రా చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చర్యలను తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము తీసుకుంటున్న చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్(Hydra Commissioner Ranganath) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని రంగనాథ్ స్పష్టం చేశారు. అటువంటి భవనాలను హైడ్రా కూల్చదని వెల్లడించారు. ఇక భవనాలు నిర్మించే సమయంలో మిగిలిపోయిన వ్యర్థాల వెంటనే తొలగించాలని, ఆ బాధ్యత బిల్డర్లే తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యర్థాలు తొలగించి అక్కడున్న భూమిని పూర్వ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. వ్యర్థాలు అలానే ఉంచిన పలువురికి నోటీసులు ఇచ్చామని రంగనాథ్ తెలిపారు.
సర్వే నెంబర్లలో అవకతవకలకు పాల్పడి తప్పుడు సమాచారంతో అనుమతులు తీసుకుని భూములు, చెరువుల్లో నిర్మించిన కట్టడాలపైనా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా చర్యలపై ప్రజలను కొందరు తప్పు దోవ పట్టిస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడొద్దని హెచ్చరించారు. వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, వరద నీటి సమస్యను పరిష్కారించేందుకు హైడ్రా తీవ్రంగా కృషి చేస్తోందని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.