గ్రేటర్‌లో రాంకీ వేస్ట్ మెటీరియల్ దందా.. ఒక్కో లారీకి టన్ను చొప్పున వసూళ్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో రాంకీ భవన నిర్మాణ వ్యర్థాల దందా చేస్తోంది.

Update: 2024-09-16 02:22 GMT

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో రాంకీ భవన నిర్మాణ వ్యర్థాల దందా చేస్తోంది. బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ (మట్టి) రీసైక్లింగ్ పేరుతో బల్దియా నుంచి రూ.కోట్లు వసూలు చేస్తున్న ఆ సంస్థ పొట్ట కూటి కోసం మట్టి సేకరిస్తున్న మినీ లారీ యజమానులను సైతం వదిలి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారి నుంచి అందిన కాడికి దోచుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో లారీలనే నమ్ముకుని జీవిస్తున్న యజమానుల కుటుంబాల రోడ్డునపడి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ మాత్రం పట్టించుకోవడంలేదని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లోని పాత భవనాలను కూలగొట్టి కొత్త భవనాలను నిర్మించుకునే తరుణంలో వేస్ట్ మెటిరియల్ ఎక్కడపడితే అక్కడ వేయకుండా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కన్‌స్ర్టక్షన్ అండ్ డెమోలీషన్ (సీ‌అండ్‌డీ) ప్లాంట్‌కు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒక్కో ప్లాంట్‌లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఈ రీసైక్లింగ్ వల్ల నిర్మాణ వ్యర్థాలలో 90 శాతానికి పైగా తిరిగి ఉపయోగపడేలా సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి ఇలా వేర్వేరుగా వస్తాయి. నిర్మాణ వ్యర్థాలల్లో 80-20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం వస్తాయి. అలా వేరు చేసిన మెటీరియల్స్‌తో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్‌పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తున్నారు. ఈ టైల్స్ బయట మార్కెట్‌లో దొరికే వాటికన్నా నాణ్యతతో పాటు ధర కూడా 30 కన్నా తక్కువగా ఉంటాయి. ఈ మెటీరియల్స్ ఫుట్‌పాత్, ఫ్లోరింగ్ నిర్మాణానికి ఉపయోగపడతాయి.

లారీకి రూ.1,227 వసూలు..

నగరంలో నూతన భవనాల నిర్మాణం సందర్భంగా పాత నిర్మాణాలను కూలగొట్టినప్పుడు వస్తున్న బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ (మట్టి) సేకరించి తరలిస్తున్న టిప్పర్లు, టాక్టర్లు సుమారు 200 ఉన్నాయి. వీరు జీహెచ్ఎంసీ చూపించిన డంపింగ్ స్థలాలలో వేస్ట్ మెటీరియల్‌ను డంప్ చేస్తున్నారు. డంప్ చేసినందుకు గాను మొదట్లో ఒక వాహనం నుంచి జీహెచ్ఎంసీ రూ.100 కలెక్ట్ చేసింది, జీహెచ్ఎంసీకి రాంకీతో ఒప్పందం జరిగిన తర్వాత దానిని రూ.350కు పెంచారు. దీన్ని 2024 ఆగస్టు 31 వరకు వసూలు చేశారు. రాంకీ సంస్థ అకస్మాత్తుగా 2024 సెప్టెంబర్ నుంచి వాహనం లెక్క కాకుండా టన్నుకు రూ.409 నిర్ణయించింది. ఒక్కో వాహనంలో 3 టన్నుల మట్టి పడుతోంది. రాంకీ చేసిన నిర్ణయంతో ఒక ట్రిప్పుకు రాంకీకి రూ.1,227 చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. వాహనాల యజమానులు, డ్రైవర్లు వినియోగదారుల నుంచి ఒక ట్రిప్పుకు కేవలం రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో లారీ యజమానికి మిగిలేది కష్టమే. మినీ లారీలు, టిప్పర్లకు ఉపాధి కల్పించాల్సిన జీహెచ్ఎంసీ రోడ్డు పాలు చేసిందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధికి దూరం..

గ్రేటర్‌లో భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించడానికి పనిచేస్తున్న మినీ లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు 200 వరకు ఉన్నాయి. ఒక్కో వాహనం మీద ఓనర్ కం, డ్రైవర్, క్లీనరు, ముగ్గురు కార్మికులు మొత్తం 1000 మంది జీవనోపాధి పొందుతున్నారు. రాంకీ నిర్ణయంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. ఒకవైపు పెరుగుతున్న డీజిల్ చార్జీలు, వెహికల్ మెయింటెనెన్స్, పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. నగర అభివృద్ధికి తోడ్పడుతున్న వీరికి ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సింది పోయి వారి నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయమని మట్టి లారీల యజమానులు ఎల్.సోమయ్య, బాలయ్య, రమేష్, వీరేష్, లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదనపు చార్జీలను రద్దు చేయాలి: కుమార స్వామి, సీఐటీయూ నగర అధ్యక్షుడు

రాంకీ సంస్థ వసూలు చేస్తున్న అదనపు చార్జిలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ వసూలు చేసిన విధంగా ఒక ట్రిప్పుకు రూ.100 మాత్రమే వసూలు చేయాలని, రాంకీతో జీహెచ్ఎంసీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ తరలిస్తున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Similar News