న్యాయ వ్యవస్థపై రేవంత్‌వి దిగజారుడు వ్యాఖ్యలు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి దిగజారుడు వ్యాఖ్యలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు...

Update: 2024-08-30 16:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి దిగజారుడు వ్యాఖ్యలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరిచేలా మాట్లాడి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్ నాగోల్ శుభం కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాపునకు లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు, బీజేపీకి ముడిపెట్టి రేవంత్ మాట్లాడుతున్నారని లక్ష్మణ్ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి.. తన పర్సనల్ అడ్వకేట్ ద్వారా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పుకునే పరిస్థితులు తెచ్చుకున్నారని చురకలంటించారు. వన్ నేషన్, వన్ లా దేశానికి అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ 30 శాతం ఓట్లు సాధించుకుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు పెరుగుతోందని ధీమా వ్యక్తంచేశారు. సభ్యత్వ నమోదు నూతన ఒరవడికి నాంది కావాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆకాంక్షించారు.


Similar News