మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో అపశృతి..టపాసులు కాల్చుతుండగా ప్రమాదం
మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా గురువారం
దిశ, చార్మినార్ : మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా గురువారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ వద్ద ఆల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి ర్యాలీలు నిర్వహించారు. గురువారం రాత్రి సమయంలో ఆటోలో డీజేతో పాటు జనరేటర్ ఉండగా అదే ప్రాంతంలో కొందరు యువకులు టపాసులు కాల్చారు.
ఒక్కసారిగా నిప్పురవ్వలు జనరేటర్ మీద పడడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి యువకులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజన్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.