Milad-un-Nabi: హైదరాబాద్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలు వాయిదా..!
రాష్ట్రంలో వచ్చే నెల 16న జరగాల్సిన మిలాద్-ఉన్-నబి ప్రదర్శనలను 19వ తేదీన నిర్వహించుకునేందుకు గానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో వచ్చే నెల 16న జరగాల్సిన మిలాద్-ఉన్-నబి ప్రదర్శనలను 19వ తేదీన నిర్వహించుకునేందుకు గానూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ ఇదివరకే నిర్ణయించింది. కానీ, ఆ మరుసటి రోజు 17న గణేష్ నిమజ్జనోత్సవాలు ఉన్న నేపథ్యంలో మిలాద్ ఉన్ నబి ఏర్పాట్లపై గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుంచి గణేష్ నవరాత్రోత్సవాలు, 17న గణేష్ నిమజ్జనం ఉన్న విషయంపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు.
దీంతో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఉత్సవ కమిటీ వాయిదా వేసింది. అందులో భాగంగా వేడుకలను సెప్టెంబర్ 19న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే వచ్చే ఏడాది మహమ్మద్ ప్రవక్త 1500 జన్మదినం ఉండటంతో సంవత్సరం మొత్తం వేడుకలకు అనుమతి ఇవ్వాలని సీఎంను కమిటీ కోరింది. నిబంధల ప్రకారం అనుమతిని పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.