పాతబస్తీ బెల్టుషాపులో అక్రమంగా మద్యం డంపింగ్..
గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా
దిశ,చార్మినార్ : గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు రోజుల పాటు వైన్స్ లు, బార్లు మూసివేయనున్నారు.ఈ నేపథ్యంలో అక్రమంగా భారీగా మద్యం డంపింగ్ చేస్తున్న కేంద్రంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గణేష్ నిమజ్జనం రోజున మద్యం బ్లాకులో విక్రయించడానికి బెల్ట్ షాప్ కి తరలిస్తుండగా ఓ మహిళను సౌత్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 1.10లక్షల విలువైన బీర్లతో పాటు మద్యంను, మారుతి కారును స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ లలితాబాగ్ కు చెందిన ఎన్ శోభారాణి అలియాస్ లలితమ్మ (50) ఎటువంటి లైసెన్స్ లేకుండా అధిక ధరకు తెల్లవార్లు స్థానికంగా పెద్ద ఎత్తున మద్యం విక్రయిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఆమెపై కేసులు నమోదు చేసినప్పటికీ లలిత ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాకుండా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18 వ తేదీ సాయంత్రం 6గంటల వరకు వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆంక్షలు విధించిన విషయం విధితమే.
దీంతో పెద్ద ఎత్తున మద్యం నిలువ ఉంచి అధిక ధరకు విక్రయించాలన్న నేపథ్యంలో లలిత మారుతి వ్యాన్లో సమీప వైన్స్ షాపుల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి లలితా బాగ్లోని బెల్ట్ షాప్ కు తీసుకువచ్చింది. లలిత బెల్టు షాపులోకి డంప్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం దాడులు నిర్వహించింది. రెడ్ హ్యాండెడ్గా లలితను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 40 కాటన్ల బీర్లతో పాటు 12 బాటిళ్ల మద్యంతో పాటు ఒక మారుతి వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సౌత్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛత్రినాక పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.