హై కోర్టు ఆర్డర్ వచ్చేలోపే హైడ్రా పని పూర్తి..

Update: 2024-08-24 16:47 GMT

దిశ, శేరిలింగంపల్లిః గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం నూతనంగా వెలుగులోకి తీసుకువచ్చిన హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) శరవేగంగా దూసుకుపోతుంది. టాలీవుడ్ హీరో నాగార్జున గత కొన్నేళ్ల క్రితం శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ డివిజన్ ఖానామెట్ లోని తమ్మిడికుంట బఫర్ జోన్ లో నిర్మించిన ఎన్ కన్వేషన్ పై హైడ్రా కొరడా ఝుళిపించింది. గంటల వ్యవధిలోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టం అయింది. ఉదయం 7.56 గంటలకు ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న హైడ్రా టీం వేగంగా పని ప్రారంభించింది. నోటీసులు అందించిన వెంటనే హిటాచీలు, ఇతర మిషన్లతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు మొదలు పెట్టారు. మధ్యాహ్నం 12.10 గంటల వరకు పూర్తిగా నేలమట్టం చేశారు. అనంతరం అక్కడి నుండి మెటల్ చార్మినార్ వైపు ఉన్న కబ్జాలను కూడా తొలగించారు. మధ్యాహ్నం 12.30 గంటల లోపు ఎన్ కన్వెన్షన్ తొలగింపు ప్రక్రియ పూర్తి అవగా.. మధ్యాహ్నం హీరో నాగార్జున రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌స్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతల‌ను ఆపాల‌ని మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్ల‌డించారు. అయితే అప్పటికే ఈ కూల్చివేతలు పూర్తవడం గమనార్హం. నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నగరంలోని చెరువులు, నాలాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి కబ్జాలను తొలగించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Similar News