ఇంటి పైకప్పు కూలి గృహిణికి గాయాలు..

Update: 2023-09-25 16:31 GMT

దిశ, కార్వాన్: వాంబే గృహాల ఇంటి పైకప్పు కూలి ఓ గృహిణికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన అఫ్జల్ సాగర్‌లో సోమవారం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాంపల్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం పక్కన ఉండే భీమ్ రావు బాడ బాధితులకు 2007లో సంవత్సరంలో అఫ్జల్ సాగర్‌లో ధోబి ఘాట్‌లో నిర్మించిన వాంబే గృహాల్లో కేటాయించారు. అయితే బ్లాక్ నెంబర్ 4 ప్లాట్ నెంబర్ 29 ఎస్ లో దాసరి శివరాం ప్రసాద్ కుటుంబం నివాసం ఉంటుంది.

సోమవారం ఉదయం దాసరి శివరాం ప్రసాద్ భార్య దాసరి దేవిక (35) ఇంట్లో వంట చేస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలింది. కూలిన పైకప్పు ఆమె తలపై పడింది. దీంతో ఒక్కసారిగా ఆమె కింద కుప్పకూలిపోయింది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు గమనించి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం నాంపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యులు తలకు ఎనిమిది కుట్లు వేసి, బాధితురాలిని డిశ్చార్జి చేశారు. సమాచారం అందుకున్న నాంపల్లి మండల రెవెన్యూ అధికారులు హబీబ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


Similar News