బీఆర్ఎస్, కాంగ్రస్ ఒక్కటే: బీజేపీ నేత నారాయణ రెడ్డి

బీజేపీలో.. బీఆర్ఎస్ విలీనమని మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్.. తన స్థాయిని దిగజార్చుకోవద్దని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ..

Update: 2024-08-17 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో.. బీఆర్ఎస్ విలీనమని మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్.. తన స్థాయిని దిగజార్చుకోవద్దని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఏది పడితే అది మాట్లాడొద్దని శనివారం ఒక ప్రకటనలో సూచించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రస్తావనే లేదన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, కాంగ్రస్ ఒక్కటేనని, అందుకే గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారని, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారని, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌‌కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, అంటే ఈ రెండు పార్టీలు ఒక్కటేననేది దీని ద్వారా స్పష్టమవుతోందన్నారు. బీజేపీలో.. బీఆర్ఎస్ విలీనమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News