మియాపూర్ భూముల కేసులో ఏ1 సంగీతకు బెయిల్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల ఆక్రమణల కేసులో కీలక పరిమాణాలు వెంటవెంటనే జరిగిపోతున్నాయి.

Update: 2024-07-08 08:13 GMT

దిశ, శేరిలింగంపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూముల ఆక్రమణల కేసులో కీలక పరిమాణాలు వెంటవెంటనే జరిగిపోతున్నాయి. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఆక్రమణలకు యత్నించిన వారు పోలీసుల మీద రాళ్లదాడికి దిగడం తెలిసిందే. అయితే ఈ పరిణామంతో స్పందించిన పోలీసులు ఆందోళనకారులను భారీ పోలీసు బలగాలతో అక్కడి నుండి పంపించేసిన విషయం తెలిసిందే. భూముల ఆక్రమణలకు, పోలీసులపై దాడికి కారణమయ్యారు అంటూ మొత్తం 83 మందిపై కేసులు పెట్టగా అందులో ఇది వరకు 60 మందిని అరెస్ట్ చేశారు. మరో 23 మంది అప్ స్కాండింగ్ లో ఉన్నారంటూ పోలీసులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్లు సమాచారం.

ఈ భూ ఆక్రమణలకు ఆజ్యంపోసి, పోలీసులపై దాడులకు యత్నించడంలో సంగీత అనే మహిళ కీలక భూమిక పోషించింది అంటూ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు హత్యాయత్నంతో పాటు, భూ ఆక్రమణలకు యత్నం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని, స్థలాలు ఇప్పిస్తానని మోసం చేసింది అంటూ పలు సెక్షన్ల కింద సంగీతపై కేసులు నమోదు చేసి ఆమెను ఏ1 గా పేర్కొన్నారు. మియాపూర్ గొడవల అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అయితే ఇంతటి ఘటనకు కారణమైన సంగీతకు తాజాగా బెయిల్ మంజూరు అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులపైనే దాడికి కారణమైందని, భూ ఆక్రమణలకు ఆజ్యం పోసిందని చెబుతున్న సంగీతకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనక ఎవరున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.


Similar News