హైదరాబాద్ సెగ్మెంట్లో స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం.. గట్టెక్కేదెవరో?

రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతోంది.

Update: 2024-05-15 02:14 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్ర ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోన్న హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఫలితం ఎలా ఉండబోతోంది. స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం బీజేపీని గట్టెక్కిస్తుందా.. లేక ఎంఐఎం మరోమారు గెలుపును సొంతం చేసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈనెల 13న హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలలో 2019తో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. అప్పట్లో 44.84 పోలింగ్ నమోదు కాగా.. తాజాగా జరిగిన ఎన్నికలలో ఇది 46.08కి పెరిగింది. కేవలం 1.24 శాతం మాత్రమే ఎక్కువగా పోలింగ్ నమోదు కాగా ఇది గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని పార్టీలు విశ్లేసిస్తున్నాయి.

ఎంఐఎంకు పట్టు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చార్మినార్, బహదూర్‌పుర, మలక్‌పేట్, చాంద్రాయణ్‌గుట్ట అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడా 50 శాతం పోలింగ్ నమోదు కాలేదు. మరోవైపు హిందువులు అధికంగా ఉన్న గోషామహల్‌‌లో 49 శాతం, కార్వాన్‌లో 51 శాతం నమోదు కావడం ఎంఐఎంకు మింగుడుపడడం లేదు. ఆయా నియోజకవర్గాలలో బీజేపీకి అధికంగా ఓట్లు పడే అవకాశం ఉండడంతో మొదటి సారిగా ఎంఐఎం ఆందోళనకు కారణమైంది. మలక్‌పేట్‌లోనూ బీజేపీ భారీగా ఓట్లు రాబట్టిందనే ప్రచారం జరుగుతుండటంతో ఎంఐఎంకు మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు పోలింగ్ బూత్‌లలో కూర్చున్న ఏజెంట్లను పిలిచి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకుంటున్నారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ శాతం..

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సోమవారం నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.మలక్‌పేట్ 38.3 శాతం, కార్వాన్ 51 శాతం, గోషామహల్ 49 శాతం, చార్మినార్ 48.53, చాంద్రాయణ్‌గుట్ట 45.19 శాతం, యాకుత్‌పురా 42.7 శాతం, బహదూర్‌పురా 48.7 శాతం, సికింద్రాబాద్ పార్లమెంట్‌ పరిధిలో 49.04 పోలింగ్ శాతం నమోదైంది.

Tags:    

Similar News