స్పెషాలిటీ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా కీలక సూచన

ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), ఆరోగ్య భద్రత కార్డుల ద్వారా చికిత్సను అందించడంలో ఎలాంటి సమస్యలు రావొద్దని హెల్త్

Update: 2024-07-20 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్), ఆరోగ్య భద్రత కార్డుల ద్వారా చికిత్సను అందించడంలో ఎలాంటి సమస్యలు రావొద్దని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా సూచించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా పేద, మధ్య తరగతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత కార్డుల ద్వారా వేగంగా వైద్యం అందించాలని ఆదేశించారు. శనివారం ఆయన తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా స్పెషాలిటీ హాస్పిటల్స్ అందిస్తున్న నగదు రహిత సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామన్నారు.

నగదు రహిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెరుగైన వైద్య సేవలను నిరంతరం అందించాల్సిందిగా కోరారు. ఇదిలా ఉండగా, నగదు రహిత సేవలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20 నుంచి స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత కార్డుల ద్వారా చికిత్సలు నిలిపివేస్తున్నట్లు ఆ ఆసోసియేషన్ వెల్లడించింది. దీంతో మంత్రి చర్చలు జరిపి, బిల్లులు సకాలంలో చెల్లించేలా చొరవ తీసుకుంటానని ఆసుపత్రుల యాజమాన్యాలకు హామీ ఇచ్చారు. దీంతో నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, ఆ స్కీమ్‌లపై ట్రీట్మెంట్‌ను కంటిన్యూ చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర్‌కు లేఖను అందించారు.

Tags:    

Similar News