గురుకుల అభ్యర్థుల నిరసనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర ట్వీట్.. ప్రభుత్వంపై ఫైర్

గురుకుల అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందేని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-06-26 08:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందేని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల అభ్యర్థుల నిరసనకు ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద నిలబడి ఎన్నిసార్లు అభ్యర్థించినా అభ్యర్థుల మొర అలకించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, నాణ్యమైన రెసిడెన్షియల్ తో కూడిన విద్యను పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. టీచర్ల కొరత లేకుండా చేసి, విద్యాప్రమాణాలు మరింత పెంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో 9210 టీచర్ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఉండాలని, ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోవద్దనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుండి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందుకు భిన్నంగా వ్యవహరించడం వల్ల ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం జరిగిందని తెలిపారు. దీనివల్ల దాదాపు 2500 పైగా టీచర్ పోస్టులు మిగిలిపోయి, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి, అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News