గ్రూప్ 1 మెయిన్ పరీక్షల పగడ్బందీగా నిర్వహించాలి :చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి

ఈనెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.

Update: 2024-10-17 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుంచి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీ.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.

టీజీపీఎస్సీ చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు. గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.

టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.

అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతర విద్యుత్తు సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సీఈ లు పర్యవేక్షిస్తారని ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Similar News