బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు!

రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-10-17 14:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజే తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడి అల్పపీడనం గా మారే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నెల 22న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD ప్రకటించింది. దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. అంతేకాదు ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోనూ రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడేందుకు అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


Similar News