దివ్యాంగులకు అండగా సర్కారు..10 నుంచి బాధితుల గుర్తింపునకు ప్రత్యేక క్యాంపులు

కాంగ్రెస్ కొత్త సర్కారు దివ్యాంగులకు వరంగా మారుతోంది. శారీరక మానసిక, బధిర, అంధ వికలాంగులకు అండగా నిలిచేందుకు అధికార యంత్రాంగం వారికి సహాయక ఊతం అందించేందుకు చర్యలు చేపట్టింది.

Update: 2024-09-09 03:38 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ కొత్త సర్కారు దివ్యాంగులకు వరంగా మారుతోంది. శారీరక మానసిక, బధిర, అంధ వికలాంగులకు అండగా నిలిచేందుకు అధికార యంత్రాంగం వారికి సహాయక ఊతం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ఇప్పటికే గుర్తించిన దివ్యాంగులకు సహాయక యంత్రాలు, ఇతర సపోర్టింగ్ అసెట్స్ అందజేయనున్నారు.

దివ్యాంగులకు అండగా..

పుట్టుకతో దివ్యాంగులకు సర్కారు ఊత కర్రగా నిలిచేందుకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సర్వేను చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ బోర్డు గుర్తించిన దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా వారికి అవసరమైన సపోర్టింగ్ అసెట్స్ అందజేయనున్నారు. శారీరక వికలాంగులకు బ్యాటరీ సైకిల్లు, మూడు చక్రాల రిక్షాలు, వీల్ చైర్లు, చంక కర్రలు చేతి కర్రలు అందించనున్నారు. బదిరులకు హియరింగ్ బడ్స్ అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులకు ప్రత్యేక మొబైల్ ఫోన్లు, హ్యాండ్ స్టిక్స్ ఇచ్చేందుకు ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మానసిక వికలాంగులకు మానసిక సంబంధిత కిట్స్ ఇవ్వనున్నారు.

రేపటి నుంచి ప్రత్యేక క్యాంపులు..

దివ్యాంగులకు అండగా ఉండేందుకు ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం చర్యలకు శ్రీకారంగా ముందుగా నిర్మల్ జిల్లాలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 10 తేదీ నుంచి 12 వరకు నిర్మల్ జిల్లాలో ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. పదో తేదీన ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మామడ, కడం, ఖానాపూర్, పెంబి మండలాల దివ్యాంగులకు సత్తెనపల్లి రైతు వేదికలో క్యాంపు ఏర్పాటు చేశారు. 11 తేదీన ముధోల్ నియోజకవర్గంకు సంబంధించి బాసర్, కుబీర్, ముధోల్, బైంసా, లోకేశ్వరం, తానూరు, కుంటాల, నర్సాపూర్ జి మండలంలో బైంసా పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేశారు. 12 న సారంగాపూర్, నిర్మల్ రూరల్ & అర్బన్, లక్ష్మణ చందా, దిలావర్పూర్, సోన్ మండలాలకు సంబంధించి నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూర్తి ఆధారాలతో రావాలి..

దివ్యాంగులు ప్రభుత్వం అందించనున్న సహాయం కోసం పూర్తి ఆధారాలతో రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ట్రై సైకిల్ బ్యాటరీ సైకిల్‌కు 80 శాతం అంగవైకల్యం ఉన్నవారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఇతర అంగవైకల్యం ఉన్నవారికి 40 శాతం ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. యుడీఐడీ కార్డు, సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 16 సంవత్సరాలు పైబడి ఉన్న ధ్రువీకరణ పత్రం అంగవైకల్యం చూపుతున్న ఫొటో తీసుకుని రావాలన్నారు. ఈ శిబిరాల్లో జిల్లా సంక్షేమ అధికారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తదితరులు పాల్గొనున్నారు.


Similar News