మళ్లీ అధికారంలోకి వస్తాం.. మరో 15 ఏళ్లు బీఆర్ఎస్‌దే పవర్: KCR కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-07-02 14:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజలచే ఛీ అనిపించుకునేలా వాళ్లు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగిందని గుర్తు చేశారు. మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జడ్పీ చైర్మన్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

వారితో కలిసి భోజనం చేశారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా సాగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తున్నదన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు.

పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా..? అని ప్రజలే అసహించు కుంటున్నారన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెడిపేస్తామంటున్నారని.. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి మరి దాన్నే చెడిపేస్తరా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చినంక గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను పేర్లు మార్చకుండా అమలు చేశామని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని రైతుబంధు పథకాన్ని అద్భుతంగా రైతులందరికీ అందించామన్నారు.

ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రకరకాల కారణాలతో ఆ పథకానికే ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కొంచెం సమన్వయంతో ఓపిక పట్టాలని అన్నారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. ఈ సారి బీఆర్ఎస్ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్ మీడియాను కూడా పటిష్టంగా తయారు చేస్తామన్నారు. 

Similar News