మంత్రి సీత‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో తొలి కంటెయినర్ పాఠశాల

రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాల అందుబాటులోకి రానుంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు.

Update: 2024-09-17 04:53 GMT

దిశ వెబె డెస్క్ : రాష్ట్రంలో తొలి కంటెయినర్ పాఠశాల అందుబాటులోకి రానుంది. తొలిసారిగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పాఠ‌శాల‌ను పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ధ‌న‌స‌రి ఆన‌సూయ‌ సీత‌క్క మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం విద్యార్థుల కోసం ఈ కంటెయినర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావ‌స్థకు చేరుకుంది. అట‌వీ ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటుకు మంత్రి సీత‌క్క శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని తాడ్వాయ్ మండ‌లంలో కంటెయిన‌ర్ ఆసుప‌త్రిని మంత్రి సీత‌క్క అందుబాటులోకి తేవ‌డంతో స్థానిక ప్రజలకు వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు కంటెయిన‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభిస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవుతో రూపొందించారు. ఇందులో ఇద్దరు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్యవంతంగా కూర్చునే విధంగా కంటెయిన‌ర్ పాఠ‌శాల‌ను అందుబాటులోకి తెచ్చారు.

అటవీ ప్రాంతంతో నిబంధ‌న‌లు స‌డ‌లించాలి : సీతక్క

ఏజేన్సీ ఆవాస గ్రామాల్లో నివ‌సిస్తున్న ప్రజ‌ల‌కు మౌళిక స‌దుపాయ‌ల‌ను క‌ల్పించేందుకు అనుగుణంగా అట‌వీ చ‌ట్టంలో మార్పులు చేయాల‌ని మంత్రి సీత‌క్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. తాగు నీటికి అవ‌స‌ర‌మైన పైపులు, విద్యుత్ లైన్లు, ర‌హ‌దారులు, ప్రభుత్వ భ‌వ‌నాలు నిర్మించేందుకు అట‌వీ నిబంధ‌న‌లు ఆట‌కంగా మారాయ‌ని పేర్కొన్నారు. మైనింగ్, ఇత‌ర కార్యక‌లాపాల కోసం నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేస్తున్న కేంద్రం...అటవీ ప్రజల అభివృద్ది కోసం నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. అట‌వీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ ఆవాసాల‌కు తాగు నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు సోలార్ విద్యుత్ ను వినియోగించాల్సి వ‌స్తుంద‌న్నారు. క‌నీసం విద్యా, వైద్య సేవ‌లు ఆదివాసీల‌కు అందేలా అట‌వీ చ‌ట్టంలో త‌గిన‌ మార్పులు చేయాల‌ని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.


Similar News