BRS విస్తరణ ప్లాన్‌పై మొదలైన కసరత్తు.. వాటిపై డైలమా!

భారత్ రాష్ట్ర సమితి పేరుతో పొరుగు రాష్ట్రాలకు విస్తరించడంపై ఆ పార్టీలో కసరత్తు మొదలైంది.

Update: 2022-12-30 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితి పేరుతో పొరుగు రాష్ట్రాలకు విస్తరించడంపై ఆ పార్టీలో కసరత్తు మొదలైంది. భారీ స్థాయి హోర్డింగులతో కర్నాటక, మహారాష్ట్రల్లో ఎంట్రీ కావాలని ప్రాథమికంగా నిర్ణయం జరగడంతో పాటు కసరత్తు కూడా మొదలైంది. తెలంగాణ మోడల్‌ను, రైతు సంక్షేమ పథకాలను ప్రచారం చేసే తీరులో ప్రభుత్వ ఖర్చుతో హోర్డింగులు పెడితే వచ్చే లీగల్ చిక్కులపై మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు, అధికారులు. పార్టీ పేరుతో వెళ్ళాలనుకుంటే పడే ఆర్థిక భారంమీద చర్చలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని మొత్తం హోర్డింగుల లెక్కలు తీయడంతో పాటు ఏజెన్సీలను షార్ట్ లిస్టు చేసే ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పేరుతో పోటీ చేయదగిన పొటెన్షియల్ ఉన్న నియోజకవర్గాలు, జిల్లాల్లో ఫీల్డ్ స్టడీ కోసం ఇప్పటికే పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే తీరులో హోర్డింగులను పెట్టినట్లయితే కోర్టులో పిటిషన్లు దాఖలైతే వాటికి కౌంటర్‌గా చెప్పాల్సిన సమాధానంపై కూడా ప్రాథమిక స్థాయిలో అధికారులతో చర్చలు జరిగాయి. సుమారుగా ఎంత ఖర్చవుతుందనే అంశం కంటే పక్క రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలను ప్రచారం చేయడానికి మౌలిక అవసరం ఏమున్నది అనే కోణంలో కోర్టు ప్రశ్నించే అవకాశాలపై సమాచార పౌర సంబంధాల అధికారులతో కేసీఆర్ ఒక దఫా చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రభుత్వం తరపున హోర్డింగులు పెట్టి ప్రజా ధనాన్ని ఖర్చు చేయడంలోరి అనుకూల, ప్రతికూల అంశాలను సీఎంకు వారు వివరించారు. పార్టీ తరఫున హోర్డింగులు పెట్టడం ఉత్తమం అనే సూచన ఇచ్చినట్లు సమాచారం. పబ్లిసిటీలో సమాచార పౌర సంబంధాల శాఖకు ఉన్న అవగాహన, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్చలు జరిగాయి.

మహారాష్ట్రలో హోర్డింగులపై ప్రచారం చేయడానికి సుమారు ఇరవై యాడ్ ఏజెన్సీలతో లిస్టు సిద్ధమైంది. బీఆర్ఎస్ ఫ్యూచర్ పొలిటికల్ అవసరం ఎక్కడ ఉన్నదో గుర్తించిన తర్వాత అక్కడి హోర్డింగులపై ప్రచార పర్వాన్ని హోరెత్తించే ప్రాసెస్ ఊపందుకుంటుంది. పూణె, నాందేడ్ బాధ్యతలను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండేలకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించి వచ్చారు. ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఏ పార్టీతోనూ సహకార ధోరణి, పొత్తు లాంటివి లేకపోవడంతో నిజాం కాలంనాటి జిల్లాలపైనే బీఆర్ఎస్ నమ్మకాలు పెట్టుకున్నది. తెలంగాణ రైతు, సంక్షేమ పథకాల పట్ల కనీస అవగాహన ఉన్న నియోజకవర్గాలపై తొలుత ఫోకస్ పెట్టింది. కిసాన్ సభ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఎంట్రీ కావాలని భావిస్తున్న బీఆర్ఎస్ 2024 ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది.

ఇదే తీరులో కర్నాటక రాష్ట్రంలోనూ పబ్లిసిటీ స్ట్రాటెజీపై చర్చలు జరిగాయి. మంత్రి శ్రీనివాసగౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఒక దఫా ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చారు. ఆ రాష్ట్రంలో జేడీఎస్ సహకారంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు జేడీఎస్‌కు బీఆర్ఎస్ సహకారం అందించనున్నది. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్‌కు జేడీఎస్ పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కేటాయించనున్నది. తెలంగాణ స్కీమ్‌లకు జేడీఎస్ సానుకూలంగా స్పందించిందున అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటివి హామీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ పథకాలపై జేడీఎస్ ఆధారపడాలని అనుకుంటున్నందున వీటిని హోర్డింగుల ద్వారా కర్నాటక ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలనుకుంటున్నది బీఆర్ఎస్.

బీఆర్ఎస్‌ను లాంఛనంగా ప్రకటించిన టైమ్‌లోనే ఢిల్లీలో హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించి అంతకుముందు పర్యటన సందర్భంగా ఢిల్లీ క్యాంపు కార్యాలయంలో కసరత్తు మొదలుపెట్టారు. ఎయిర్‌పోర్టు మొదలు సెంట్రల్ ఢిల్లీ వరకు అన్ని హోర్డింగులపై తెలంగాణ మోడల్ ఖ్యాతిని ప్రచారం చేసే డిజైన్లపై అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఆ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కోడ్‌తో పబ్లిసిటీ ప్రోగ్రామ్ వాయిదా పడింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో పాటు ఢిల్లీలో ఆఫీస్ ఓపెనింగ్ కూడా పూర్తికావడంతో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభావం ఉన్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకృతమైంది. త్వరలోనే హోర్డింగుల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టమైన వైఖరిని తీసుకోనున్నారు.

Also Read..

BJP vs BRS.. BL సంతోష్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం 

Tags:    

Similar News