Minister Seethakka: దేశ నిర్మాణంలో కీలక పాత్ర ఇంజినీర్లదే: మంత్రి సీతక్క

దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) పేర్కొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించారని తెలిపారు.

Update: 2024-09-14 16:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) పేర్కొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించారని తెలిపారు. తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజినీర్లు(Engineers) పనిచేయాలని కోరారు. ఇంజినీర్లకు వాహన సదుపాయం, పెండింగ్లో ఉన్న డిఏపిఆర్సి, పదోన్నతులు వంటి అంశాలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్‌లో శనివారం జరిగిన పంచాయతీరాజ్ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. దేశ మొట్టమొదటి సివిల్ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా ఇంజినీర్లు అంతా పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ దేశ అభివృద్ధిలో ఇంజినీర్లు పోషించిన పాత్రను వివరించారు. ఎన్నో ఆనకట్టలకు కూలీలతో పాటు ఇంజినీర్లు కూడా రాళ్ళేతారని, వారి కృషి ఫలితంగానే ఆహార సంక్షోభం వంటి ఎన్నో సంక్షోభాలను ఈ దేశం అధిగమించగలిగిందని చెప్పారు. మరి ముఖ్యంగా సివిల్ ఇంజినీర్లు లేకపోతే మనదేశంలో ఈ స్థాయి అభివృద్ధి జరిగేది కాదని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలను పెంచేలా ఇంజినీర్లు పనిచేయాలన్నారు. ఒకప్పుడు 20 ఏండ్ల పాటు భద్రంగా ఉండే సిసి రోడ్లు, ఇప్పుడు చిన్నపాటి వర్షానికే దెబ్బ తినడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో సివిల్ ఇంజినీర్లు కాంట్రాక్టర్లతో కఠినంగా వ్యవహరించాలని కోరారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పారు. వర్షాలు వరదల నేపథ్యంలో దెబ్బతిన్న రహదారులను మెరుగుపరిచే విషయంలో ఇంజినీర్లంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

రోడ్ల మరమ్మతుల కోసం అవసరం అయితే అధిక సమయాన్ని కేటాయించేందుకు కూడా సిద్ధపడాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని గ్రామాల్లో రహదారి, రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. వృత్తికి వన్నె తెచ్చేవారినే చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని, అందుకే సుప్రసిద్ధ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజినీర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటామని పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తిగా ఇంజినీర్లు అంతా జాతి నిర్మాణానికి పునర్ అంకితం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం, ఇతర ఉన్నతాధికారులు, పంచాయతీ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.


Similar News