Kanha Shanti Vanam : పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం.. కన్హ శాంతి వనంలో డిప్యూటీ సీఎం

ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Update: 2024-08-29 11:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ శాంతి కోసం ఏ స్థాయిలో ఉన్న మనం అంతా భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరులోని కన్హ శాంతి వనంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడ వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో నెలకొన్న అశాంతి నిర్మూలనకు శాంతి మార్గమే ప్రధానమన్నారు. అందుకు మానసిక పరివర్తన చెందాలని, మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం అని తెలిపారు. ధ్యానం పై దృష్టి పెట్టి నిర్మించిన కన్హ శాంతి వనం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరమని కొనియాడారు. ఏ సమస్యలు ఉన్నవారైనా కన్హ శాంతి వనంలో ధ్యానం చేసుకునేందుకు కావలసిన అన్ని రకాల వసతులు ఉంటాయని వెల్లడించారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శంకర్ కోరిక మేరకు శాంతి వనాన్ని సందర్శించానని చెప్పారు.

ధ్యానం కోసం ఎంతో ఖర్చు చేసి సుధీర ప్రాంతాలకు వెళ్తారని, తక్కువ ఖర్చుతో ఇక్కడే ధ్యానం చేసుకునేందుకు శాంతి వనంలో ఏర్పాట్లు ఉన్నాయన్నారు. కులం మతం ప్రాంతంతో తేడా లేకుండా.. నిరుపేదలు కూడా ఉచితంగా ధ్యానం చేసుకునేందుకు ఒక డార్మెటరీ నిర్మించడం అభినందనీయమన్నారు. వ్యవసాయాన్ని శాస్త్రీయంగా ఎలా నిర్వహించారు శిక్షణ ఇస్తున్నారన్నారు. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్లను ఇక్కడ సాగు చేస్తున్నారని, వాతావరణాన్ని నియంత్రిస్తూ ఏ పంట అయినా ఎలా పండించాలో ఇక్కడ అనుభవంలో తెలుసుకోవచ్చని తెలిపారు. యువతను ప్రోత్సహించేందుకు క్రికెట్ స్టేడియంని నిర్మించారని, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా పనిచేసేవారిని ప్రోత్సహించడం బాధ్యతగా భావించి శాంతి వనాన్ని సందర్శించానని స్పష్టంచేశారు.


Similar News