రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రభుత్వానికి CPM కార్యదర్శి తమ్మినేని కీలక రిక్వెస్ట్

రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను ప్రభుత్వం పునరాలోచించి సవరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ

Update: 2024-07-16 17:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవోను ప్రభుత్వం పునరాలోచించి సవరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.567లోని నిబంధనలను అమలుచేస్తే లక్షలమంది రైతులు రుణమాఫీ అర్హతను కోల్పోతారని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో సాగుచేసే రైతులకు రుణమాఫీ అమలు జరిగేలా జీవోను సవరించాలని పేర్కొన్నారు.

రేషన్ కార్డు ఆధారంగా అమలు చేయాలని నిర్ణయించారని, ఉమ్మడి కుటుంబం నుండి విడిపడిన 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డుల కోసమే గత 10సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. ఈ కారణంగా రుణమాఫీకి అర్హులు కాలేరని తెలిపారు. ఆధార్, పాస్ బుక్, రేషన్ కార్డుల డేటా సమన్వయం మేరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారని పేర్కొన్నారు. పాస్ బుక్ లేనివారు లక్షలలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ధరణి లోపాల వల్ల పాస్ బుక్ ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి నిబంధనలు పెట్టినట్టయితే చాలామంది పేదరైతులు రుణమాఫీ నుండి మినహాయించబడతారన్నారు.

సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, రైతుమిత్ర, కౌలు గుర్తింపు కార్డులు ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని నిబంధనలలో పేర్కొన్నారని, దీనివల్ల కౌలు రైతులు, పేదరైతులు నష్టపోతారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో దళిత, గిరిజన, బిసి రైతులు ఎక్కువగా ఉంటారని, తమ రుణాలను వ్యవసాయానికే ఖర్చు చేస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా రీషెడ్యూల్డ్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని జీవోలో పేర్కొనడం సరైందికాదన్నారు. దీంతోపాటుగా రెన్యువల్ చేసిన రుణాలు లేదా వసూలు చేసిన రుణాలకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. రెండు లక్షలకు పైగా రుణం ఉన్నట్టయితే ఆ అప్పు చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని విధించిన నిబంధన వల్ల మధ్యతరగతి రైతులు నష్టపోతారని పేర్కొన్నారు.

**********


Similar News