సంపత్ మృతిపై సిపిఐ(ఎం) సంచలన డిమాండ్
జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి పోలీసు రిమాండ్లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు..

దిశ, తెలంగాణ బ్యూరో: జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే వ్యక్తి పోలీసు రిమాండ్లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిష్పక్షపాతంగా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడనే అభియోగంతో సంపత్ అనే వ్యక్తిని నిజామాబాద్ సైబర్ క్రైం పోలీసు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారని, విచారణ ప్రక్రియలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా మరణించాడని తెలిపారు. పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టడంతో అతను చనిపోయాడని, సంపత్ శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అతనిని చూడటానికి కూడా అనుమతించలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం, దానికి సహకరించే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యహరిస్తే ఇది సమాజంలో ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, పోలీసులే దీనికి కారణమని తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా జాన్వెస్లీ కోరారు.