సీఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్: కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ఆరోపించారు.

Update: 2024-08-29 14:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, బాలరాజుయాదవ్ ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే హైడ్రాను తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. హైడ్రాకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. ప్రజా సమస్యలపై సీఎం దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురుకులాల్లో సమస్యలు తిష్ట వేశాయని, రేవంత్ సర్కార్ ప్రభుత్వ గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. గురుకులాల్లో ఇప్పటివరకు 38 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, మంత్రులకు, సీఎంకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. విద్య, వైద్యం పక్కన పెట్టి రేవంత్‌రెడ్డి బుల్డోజర్ పాలన తెచ్చారని ఫైర్ అయ్యారు. దుర్గం‌చెరువు పరిధిలో ఉన్న సీఎం సోదరుడి ఇల్లు ఉందని, అన్ని ఆధారాలు ఉన్నాయని ముందు అది కూల్చండి అని డిమాండ్ చేశారు. సీఎంకు కూడా వట్టి‌నాగుల‌పల్లిలో అక్రమ ఫార్మ్‌హౌజ్ ఉందని, దానిని కూల్చాలని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై రాజకీయ దురుద్దేశంతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హైడ్రా పేరిట కాంగ్రెస్‌కు ఫండ్ రేజింగ్ జరుగుతోందని ఆరోపించారు. హైడ్రా దాడులు చేస్తే రుణ మాఫీ జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.


Similar News