CM Revanth Reddy: తెలంగాణకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణకు చేరుకున్నది.

Update: 2024-08-14 06:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రేవంత్ రెడ్డి టీమ్ కు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుతో పాటు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 3వ తేదీన తొలుత సీఎం అమెరికా వెళ్లారు. అనంతరం దక్షిణకొరియాలో పర్యటిచారు. మొత్తం ఈ 11 రోజుల పాటు అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చర్చలు జరిపారు. మొత్తం 19 కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని సుమారు రూ.31, 532 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించేలా సీఎం బృందం కృషి చేసింది. ఈ పర్యటన పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు.

అధునాతన గ్రీన్ సిటీకీ మద్దతు: శ్రీధర్ బాబు

అధునాతనమైన గ్రీన్ సిటీగా ముచ్చర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా, దక్షిణకోరియా సంస్థలు ఆసక్తిని, ఉత్సహాన్ని చూపించాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే కాలంలో ప్రత్యేక నగరాన్ని ఇక్కడ చేయాలనే ఆలోచనను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, పారిశ్రామికలవేత్తల ముందు ఉంచామని, వారంతా ఆసక్తితో ఉన్నారని తెలిపారు.

Tags:    

Similar News