‘మూసీ’లో ఉన్న వాళ్లెవరూ ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-10-05 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈ రోజు మీ దగ్గరకొచ్చి కలిసి మీ సానుభూతి పొందాలనో, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ల ఆస్తులను కాపాడుకోవాలనో ప్రయత్నిస్తున్న వాళ్ల కుట్రలను పసిగట్టాల’’ని సూచించారు. కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం వివరించారు.

అనంతరం ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ.. అవసరమైతే ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల దగ్గరకే ప్రభుత్వ అధికారులను పంపిస్తామని, మూసీ బఫర్‌జోన్‌లో, రివర్‌బెడ్‌లో ఉండి ఇళ్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలో అక్కడే కూర్చుని ప్రజలను అడిగి వాళ్లే సూచన చేయాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరం పేరుతో ఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందని, కానీ ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకున్నా రూ.10 వేల కోట్లు కావని అన్నారు. ప్రజల కోసం ఆ మాత్రం చేయలేని స్థితిలో ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. 


Similar News