90 శాతం IAS, IPS ఆఫీసర్స్ ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారే: సీఎం రేవంత్

90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-06-10 10:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: 90 శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ పాఠాశాలల్లో చదివినవారేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని స్టూడెంట్స్‌కు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వందేమాతరం ఫౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా మా బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ప్రయివేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని కొనియాడారు. కార్పొరేట్ పాఠశాలలతో విద్యార్థులు పోటీపడటం మా గౌరవాన్ని మరింత పెంచింది సంతోషం వ్యక్తం చేశారు. నాతో సహా ప్రముఖ రాజకీయ నాయకులంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని గుర్తు చేశారు.

విద్యార్థులు రావడం లేదని సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని.. మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. కానీ సింగిల్ టీచర్ పాఠశాలలను మూసేయొద్దని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రతీ గ్రామం, ప్రతీ తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం ముందుకెళుతుందని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. విద్య మీద ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడని.. విద్యపై పెట్టె పెట్టుబడి మన సమాజానికి లాభాన్ని చేకూరుస్తుందని అన్నారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్‌లను ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలను పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నామని చెప్పారు. 10/10 వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశిస్తున్నానని అన్నారు. ఇంటర్మీడియట్‌లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి భవిష్యత్‌లో మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మీకు ప్రజా ప్రభుత్వం ఉంది.. ప్రజా పాలనపై నమ్మకం కలిగించేలా ముందుకెళతామని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News