మోడీ కేబినెట్‌లో చోటు.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్

కేంద్ర ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి లభించడమంటే అది కేవలం కార్యకర్తల కృషి ఫలితమేనని బండి సంజయ్ కుమార్ స్పష్టం

Update: 2024-06-09 16:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి లభించడమంటే అది కేవలం కార్యకర్తల కృషి ఫలితమేనని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. తన గెలుపుకు కృషి చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పదవి లభించడం పట్ల బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. ఈరోజు తనకు చాలా ఆనందంగా ఉందని.. తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే ఈరోజు నాకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని అన్నారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని.. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేదొక్కటేనని.. ఎన్నికలప్పుడే రాజకీయాలని తర్వాత వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బండి పేర్కొన్నారు. 


Similar News