మహిళా సంఘాల క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలి : మంత్రి సీతక్క

రాష్టంలో మహిళా సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహిస్తూ మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Update: 2024-06-20 14:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలో మహిళా సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహిస్తూ మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్య పడుతుందన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్డీఓ ), అదనపు డీఆర్డీఓలతో మహిళా శక్తి, రాష్ట్ర స్థాయి కార్యాచ‌ర‌ణ ప్రణాళిక త‌యారీపై మంత్రి సీత‌క్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళల సంఘాలకు ప్రోత్సహిస్తున్నమని తెలిపారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు.

మహిళా సంఘాలకు ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కొత్తగా ప్రారంభించబోయే మహిళా శక్తి క్యాంటీన్లలో రుచి, శుభ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదగాలని ఆకాంక్షించారు. పర్యాటక కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ రహదారుల వెంట, రద్దీ ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్వాలిటీపై మహిళా శక్తి క్యాంటిన్లు రాజీ పడొద్దన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పల్లె రుచులను, ఇప్ప పువ్వు లడ్డులు, నన్నారి వంటి సాంప్రదాయిక పానీయాలను పట్టణాలకు పరిచయం చేయాలని సూచించారు.

మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్ ) ఏర్పాటయిందని గుర్తు చేశారు. దాన్ని మరింత పటిష్ట పరిచి సేవలను విస్తరించాలన్నారు. వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు అందిస్తామన్నారు. మహిళా సంఘాల కోసం మంచి బిజినెస్ మోడల్‌లను అధికారులు గుర్తించాలని సూచించారు. డీఆర్డీవోలు జిల్లాలో పర్యటించి మహిళా సంఘాల అనుభవాలు తెలుసుకోవాలన్నారు. అందుకోసం వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళలు ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబడేలా తోడ్పాటు అందించాలన్నారు. మహిళలు అభివృద్ధి చెందిన తర్వాత ప్రభుత్వాలకే రుణాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని తెలిపారు. మ‌హిళ సంఘాల‌కు ఆర్థిక చేయూత నందించేందుకు కలెక్టర్లతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వాహిస్తామ‌న్నారు. మ‌హిళా పారిశ్రామికవేత్తల‌కు భూ కేటాయింపులు మొదలుకుని, ప్రభుత్వ రాయితీల వరకు మ‌హిళా సంఘాల‌కు క‌లెక్టర్లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ ష‌ఫీ ఉల్లా, టీజీఐఆర్డీ సీఈఓ కాత్యాయ‌నీ, ఈఎస్డీ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్, శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, వివిధ శాఖ అధికారులు డీఆర్డీఓ, అద‌నపు డీఆర్డీఓలు పాల్గొన్నారు.

సచివాలయంలో మహిళా శక్తి క్యాంటిన్లు ప్రారంభం :

సీఎం ఆలోచనలకు మంత్రి సీతక్క కార్యరూపంలో పెట్టారు . మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటిన్లు ఏర్పాటుకు చొరవ తీసుకొని వాటిని ప్రారంభించేందుకు కృషి చేసారు . ఇందులో భాగంగా శుక్రవారం సచివాలయంలో రేపు రెండు క్యాంటిన్లు ప్రారంభించనున్నారు .


Similar News