BREAKING: హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్... గులాబీ బాస్ సంచలన నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గులాబీ బాస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

Update: 2024-03-25 06:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గులాబీ బాస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 16 ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించిన ఆయన తాజాగా హైదరాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజ్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. కేసీఆర్ ఆదివారం హైదరాబద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తల అభ్యర్థన మేరకు హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు.

కాగా, గడ్డం శ్రీనివాస్ యాదవ్ నగరంలోని గౌలిగూడ చమన్ ప్రాంతంలో అక్టోబర్ 28, 1968లో జన్మించారు. పాఠశాల విద్యను కాచిగూడలోని నృపతుంగ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. 1986లో నల్లకుంట మేరీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1992 రామ్‌కోటి ప్రగతి డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు. 1988లో ఎన్‌యూఐలో క్రియాశీలకంగా పని చేసిన శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరి గోషా మహల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 2003 వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రంలో ఉత్సాహంగా పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. ఆ తదనంతరం పరిణామాలతో ఆయన 2015లో టీఆర్ఎస్‌లో చేరారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. గడ్డం శ్రీనివాస రావు పార్టీకి చేసిన సేవను గుర్తించిన కేసీఆర్ ఆయనకు లైబ్రరీస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.




 


Tags:    

Similar News