రేపు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలుస్తా.. బీజేపీ ఎంపీ కీలక ప్రకటన

మాజీ మంత్రి కేటీఆర్ జెన్వాడ ఫాంహౌజ్ తనది కాదని చెప్పడానికి సిగ్గుండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు.

Update: 2024-08-22 15:34 GMT

మాజీ మంత్రి కేటీఆర్ జెన్వాడ ఫాంహౌజ్ తనది కాదని చెప్పడానికి సిగ్గుండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు.దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్ జెన్వాడ ఫాంహౌజ్ తనది కాదని చెప్పడానికి సిగ్గుండాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు. ఫాంహౌజ్ తనది కానప్పుడు డ్రోన్ ఎగురవేస్తే కేసు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. గతంలో రేవంత్ ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మరీ ఎందుకు అరెస్ట్ చేశారని నిలదీశారు. ఫాంహౌజ్ చుట్టూ చెట్లకు శవాలు వేలాడిన రోజు హరీశ్, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రఘునందన్ మళ్లీ ఏ సభలోకి రాడని కేటీఆర్ చాలెంజ్ చేశారని, మర్చిపోయారా? అంటూ చురకలంటించారు. తానేం కేటీఆర్ బావ ఓటేస్తే గెలవలేదు కదా అని ఎద్దేవాచేశారు. బండి సంజయ్ యాదాద్రికి రమ్మంటే ఎకసెకాలాడిన హరీష్ రావుకు.. ఉద్యోగం ఊడితే తప్ప దేవుడు గుర్తుకు రాలేదేమోనని చురకలంటించారు.

బంగ్లదేశ్ కు చెందిన బ్లిట్జ్ పత్రికలో రాహుల్ గాంధీకి వివాహమైందని, పిల్లలు ఉన్నారని రాశారని రఘునందన్ రావు చెప్పారు. బ్లిట్జ్ పేపర్ రాసింది తప్పు అయితే నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకపోతే బ్లిట్జ్ పత్రికలో ప్రచురించిన ఫోటోలోని వ్యక్తి రాహుల్ సతీమణి అని చెప్పాలన్నారు. మరి బ్లిట్జ్ పేపర్ పై సిట్ వేద్దామా? రేవంత్ అంటూ రఘునందన్ ఎద్దేవాచేశారు. అదే ఎవరో హిండెన్ బర్గ్ అనే బ్రోకర్ రాసిన రెండు లైన్లను పట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆరోపించడంపై రఘుదన్ రావు ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి పెళ్లి అయ్యిందని బ్లిట్జ్ పత్రికలో వచ్చిందని, కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్ ను నమ్మితే తాను బ్లిట్జ్ ను నమ్ముతానని ఎంపీ స్పష్టంచేశారు. బ్లిట్జ్ పత్రికలో రాహుల్ తో ఉన్న అమ్మాయి ఎవరని, రాహుల్ పెళ్లి చేసుకున్నారా..? లివింగ్ టుగెదర్ లో ఉన్నారా రాహుల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాబోయే ప్రధాని అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ విదేశాల్లో పబ్, క్లబ్ ల్లో అమ్మాయిలతో తిరగడమేంటని ఆయన ప్రశ్నించారు. రేవంత్.. తనకు రాహుల్ అపాయింట్ మెంట్ ఇప్పించాలని, తాను ఢిల్లీకి స్వయంగా వెళ్లి రాహుల్ కి బ్లిట్జ్ పేపర్ చూపిస్తానని రఘునందన్ రావు చెప్పారు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ పాస్ తీసుకున్నట్లు మీడియాకు అందించారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే తానెందుకు వద్దంటానని ఎంపీ పేర్కొన్నారు. పెళ్లి చేసుకొని భోజనం పెడితే అందరి ఎంపీల్లాగే తాను కూడా వెళ్లి తిని వస్తానన్నారు.

రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఎక్కడ బయటికి వస్తుందో అనే భయంతోనే రాహుల్, కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక రిలయన్స్, అదాని వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కి హిండెన్ బర్గ్ నిజమని అనిపిస్తే తనకు బ్లిట్జ్ కరెక్ట్ అనిపిస్తోందన్నారు. బ్లిట్జ్ పత్రిక తనపై అసత్యపు వార్తలు రాసిందని రాహుల్ గాంధీ ఈ పత్రికపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని రఘునందన్ డిమాండ్ చేశారు. అదానీ తప్పుడు వ్యక్తి అయితే ఆయనతో రేవంత్ ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. సెబీ చైర్మన్ అయితే షేర్లు కొనకూడదా? అని నిలదీశారు. హిండెన్ బర్గ్ రాసిన రిపోర్ట్ పై ఎక్కడా అవకతవకలు జరగలేదని సుప్రీం తీర్పు ఇచ్చిందని రఘునందన్ రావు చెప్పారు.

కాంగ్రెస్ సీఎంలు అదానీతో ఒప్పందాలు చేసుకుంటారని, కానీ పార్టీ నేతలు మాత్రం అదానీ వ్యాపారాన్ని ప్రశ్నిస్తారని ఎద్దేవాచేశారు. రాహుల్ గాంధీకి దేశంపై ప్రేమ, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శలు చేశారు. విదేశీ జర్నలిస్టులు రాసిన పత్రికలే నమ్ముతారన్నారు. అసలు హిండెన్ బర్గ్ క్రెడిబులిటీ ఏంటని, దేశ ఆర్థిక వ్యవస్థపై హిండెన్ బర్గ్ దాడి చేస్తోందని ఫైరయ్యారు. అందులో వార్తలు రాసే వ్యక్తి ఒక షేర్స్ బ్రోకర్ అని ఆయన పేర్కొన్నారు. ఆయన అదాని షేర్స్ తగ్గించి.. ఆయన షేర్స్ పెంచుకోవాలని చూస్తున్నారని చెప్పారు. మోడీ గురించి మాట్లాడిన బీఆర్ఎస్ కు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందేనని సెటైర్లు వేశారు. ఒక్క ఎంపీ లేని వారికి జేపీసీ కమిటీతో సంబంధమేంటని, బీఆర్ఎస్ నేతలను జేపీసీ గురించి మాట్లాడమని సీఎం రేవంత్ ఎలా సూచిస్తారని ఆయన ఫైరయ్యారు. ఇకపోతే తన తమ్ముడు దందా చేయొద్దా? అని సీఎం రేవంత్ అంటున్నారని, ముందు దందా అని దేన్నీ అంటారో సీఎం తెలుసుకోవాలని రఘునందన్ రావు అన్నారు. దందా అంటే సారా వ్యాపారమని, ఇల్లీగల్ పనులను దందా అంటారన్నారు. ఇంకా కావాలంటే బాంబే రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే దందా అంటే ఎంటో చెబుతారని రఘునందన్ రావు చురకలంటించారు.


Tags:    

Similar News