పేదల ఇళ్ల జోలికి వస్తే ఖబడ్డార్.. సీఎం రేవంత్‌కి ఎంపీ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-08-30 10:02 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ‘హైడ్రా’ పేరుతో అక్రమంగా నిర్మించిన  కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను రక్షిస్తున్నారు. బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతల్లో పేదలకు సంబంధించిన ఇళ్లు కూడా ఉంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా  ఉంటూ సొంతంగా ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేదలకు సైతం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చెరువులు, కుంటల్లోని భూములను పేదలకు కొందరు బడా నాయకులు అమ్మి సొమ్ములు చేసుకున్నారు. అయితే  వారి చేసిన మోసానికి కొందరు పేదలు బలి అవుతున్నారు.  అనుమతులు లేకుండా నిర్మించారంటూ పేదల గూడులను  సైతం కూల్చి వేస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. 

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పేదల ఇళ్లు కూల్చాలని అనుకుంటే ముందు వారికి పునరావాసం చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరగకూడదనే ఇలా డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలపై సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు తప్పుకుంటారని నిలదీశారు.  ‘‘చెరువుల్లోని భూములు ప్రభుత్వ భూముల కాదు. చెరువు భూముల్లో పట్టా భూములు సైతం ఉంటాయి. కొన్ని చెరువుల్లో 100 శాతం ప్రైవేటు భూములు ఉన్నాయి.’’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News