BJP, కాంగ్రెస్ ఎంపీలు అలా చేయాలి.. మాజీ ఎంపీ వినోద్ కుమార్

తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం ముందు తెలంగాణ సమస్యలను ఉంచాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు.

Update: 2024-07-21 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం ముందు తెలంగాణ సమస్యలను ఉంచాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాజీపేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలన్నారు. ఈ బడ్జెట్ ఐదేళ్ల మోడీ పరిపాలనకు పునాది వేసేదన్నారు.

మోడీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై గత పదేళ్ల కాలంలో దృష్టి పెట్టడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీపై ఆధారపడి మోడీ కేంద్ర ప్రభుత్వం నడపాల్సి వస్తోందన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొస్తాతీరంలో రూ.60వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు కొంత మేరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్లు తెలుస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు జాతీయ పార్టీల నుంచి బీజేపీ 8,కాంగ్రెస్ 8, ఎంఐఎం 1పార్లమెంట్ స్థానాలు గెలిచారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎంపీలుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవడం జరిగిందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజుల నుంచి కేంద్రానికి ఏం వినతి పత్రాలు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు మాత్రమే సమయం ఉందని.. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే. అరుణ ఈ రోజు, రేపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఖాజీపేట్ లో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నవోదయ విద్యాలయాలు తెలంగాణ లోని ప్రతి జిల్లాకు ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 8మంది ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News