తెలంగాణకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!

నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2024-06-11 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్‌నగర్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.

నైరుతి రుతుపవనాల విస్తరణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ జిల్లాలో భారీ వర్షాలు:

కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో బుధవారం భారీగా వర్షాలు కురుస్తాయని సూచించింది.

మోస్తారు వర్షాలు..

కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మూడు రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.


Similar News