Bhatti Vikramarka: కేటీఆర్, హరీశ్ రావువి సోషల్ మీడియా రాజకీయాలు..భట్టి విక్రమార్క కౌంటర్

కేటీఆర్, హరీశ్ రావు పూర్తిగా ట్విట్టర్, సోషల్ మీడియాలోనే రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-09-02 05:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని, అధికారులు 24 గంటలు విధుల్లో ఉండి శ్రమిస్తున్నారని చెప్పారు. సోమవారం ఖమ్మం జిల్లాలో ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నామని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నామన్నారు. బాధితులకు అవసరమైన మంచినీళ్లు, చిన్నారులకు పాలు, మందులు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరద సహాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు భట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, హరీశ్ రావు క్షేత్ర స్థాయిని మరిచిపోయి పూర్తిగా ట్విట్టర్, సోషల్ మీడియాలోనే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వద్దకు వస్తే ప్రజలు తిరగబడతారని అదే సోషల్ మీడియాలో అయితే ఏదైనా చెప్పే అవకాశం ఉండటంతో వారు సోషల్ మీడియాకే పరిమితం అయ్యారని విమర్శించారు. అధికారులు కూడా మనుషులే అని రేయింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి అభినందిస్తున్నానన్నారు.


Similar News