రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో భాగమవ్వండి : అమెరికన్ కంపెనీలకు మంత్రి భట్టి పిలుపు

Be a part of the state's industrial growth: Minister Bhatti's call to American companies

Update: 2024-09-25 17:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో, ఎదుగుదలలో పాలుపంచుకోవాలని అమెరికన్ పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వేగాస్ లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని, తెలంగాణ ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడాలని, దీనికి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు, ఖనిజాలను రక్షణతో మంచి ఉత్పాదకతతో ఉత్పత్తి చేయడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చవచ్చని తెలిపారు. భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలను వెలికితీయడంలో, నిలకడగల అభివృద్ధిని సాధించడంలో అమెరికన్ కంపెనీలు భాగస్వాములు కావచ్చని సూచించారు. హైదరాబాద్ కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో కూడా భాగస్వాములు కావాలని ఆయన అమెరికన్ పారిశ్రామిక కంపెనీలకు, వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇక్కడ స్థాపించిన అమెరికన్ కంపెనీలు ఎంతో సౌకర్యవంతంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయని, ఇంకా వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ‌కు చెందిన ప్రభుత్వ కంపెనీ అయిన సింగ‌రేణికి క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ అన్వేష‌ణ‌లో పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఇరుదేశాధినేతల సమావేశంలో పరస్పరం రెండు దేశాలు ఒకరికొకరు తోడ్పడాలని అంగీకరించిన నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు మరింతగా ముందుకు రావాలని మంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

అమెరికన్ ప్రభుత్వ ప్రతినిథి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్స్ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకట రామన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయని, ఈ ఒరవడిని కొనసాగిస్తూ మరిన్ని అమెరికన్ సంస్థలు తెలంగాణలో తమ వ్యాపారాలు ప్రారంభిస్తాయని ఆయన ఆశాభావం ప్రకటించారు.

నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ భారీ అంతర్జాతీయ మైనెక్స్-2024 ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1900 యంత్ర ఉత్పత్తి సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో భారీ మైనింగ్ తవ్వకాల యంత్రాలు, ఖనిజ రవాణా వాహనాలు, రక్షణ సేవలు, అనుబంధ యంత్ర విభాగాలను ప్రదర్శనకు ఉంచారు. 121 దేశాల నుంచి సుమారు 44 వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్రం నుంచి తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు సారథ్యంలోని రాష్ట్ర అధికారుల బృందం ప్రముఖ ఖనిజ పరిశ్రమల యంత్ర తయారీ సంస్థలైన కొమాట్సు, క్యాటర్ పిల్లర్, బీకేటీ టైర్స్ తదితర స్టాల్స్ ను సందర్శించారు. అధికోత్పత్తి సాధించే రక్షణ సహిత భారీ యంత్రాల గురించి ఆయా కంపెనీల వారు తమ ప్రత్యేకతలను వివరించారు. ప్రదర్శనలో ఉంచిన వాటిలో అత్యాధునిక కంటిన్యూయస్‌ మైనర్ యంత్రాలు, లోడ్ హాల్ డంపర్లు, మైనింగ్ డోజర్లు, బ్లాస్ట్ హోల్ డ్రిల్స్, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ ఇంకా అత్యాధునిక టైర్లు, స్పేర్లు, వివిధ సేవలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించారు. అమెరికన్ ప్రతినిధి బృందంలో ఇంకా గ్లోబల్ మార్కెట్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్ ఒలిమర్ రివేరానోవా, కమర్షియల్ స్పెషలిస్ట్ శాంతను సర్కార్, ఇంటర్నేషనల్ ట్రేడ్ స్పెషలిస్ట్ కార్నిలియస్ గ్యాంఫి, గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ లీడర్ డేరెక్ట్ శ్లికెషన్, గ్లోబల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ స్పెషలిస్ట్ జాస్మిన్ బ్రాస్ వెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ శనివారం వరకు కొనసాగనుంది. మంత్రి వెంట రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


Similar News