చైర్మన్‌ పోస్టు నియామకంపై ఆగ్రహం.. పీఏసీ మీటింగ్‌‌కు బీఆర్ఎస్ సభ్యులు దూరం

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో శనివారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది.

Update: 2024-09-21 15:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాలులో శనివారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. కమిటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ తరపున ఐదుగురి పేర్లను ఇచ్చినా వాటిని కాదని అరికెపూడి గాంధీని స్పీకర్ ఖరారు చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలోనే చైర్మన్‌ను, స్పీకర్‌ను గులాబీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధంగా చైర్మన్ ఎంపికతో పాటు కమిటీ కూర్పు నిర్ణయమైందని ఆరోపించారు. నామినేట్ చేయాల్సిందిగా పంపిన ఐదుగురు పేర్లను కాదని కొత్త పేరును ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందంటూ స్పీకర్‌ను ఈ సమావేశంలో నిలదీశారు. సమాధానం చెప్పడానికి స్పీకర్ సంసిద్ధం కాకముందే శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నందుకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (పీఏసీ కమిటీలో సభ్యులు) తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కమిటీ కూర్పు, స్పీకర్ తీరు అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల క్రితం ఏర్పడిన పీఏసీ కమిటీలో బీఆర్ఎస్ తరఫున వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ (అసెంబ్లీ సభ్యులు), సత్యవతి రాథోడ్, ఎల్.రమణ (ఎమ్మెల్సీలు) మెంబర్లుగా ఉన్నారు. సంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం పీఏసీ చైర్మన్ పోస్టును ప్రతిపక్ష సభ్యుడికి స్పీకర్ ఇస్తారు. ఆ ప్రకారమే ఈసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని, తమ పార్టీ ఎమ్మెల్యే కాదని ఆరోపించారు. శాసనసభ గణాంకాల ప్రకారం అరికెపూడి గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆయనకు కాంగ్రెస్‌కు సంబంధం లేదని స్పీకర్ కార్యాలయం గతంలోనే వివరణ ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాలు ముగిసే రోజున పార్టీల వారీగా ఎమ్మెల్యేల లెక్కలను స్పీకర్ ప్రకటించినప్పుడు కూడా అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, ఆ రోజు ఆ పార్టీ తరఫున ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదని కూడా స్పీకర్ ఆఫీస్ వివరణ ఇచ్చింది. ఇప్పుడు తొలి సమావేశం రోజున కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే విషయాన్ని ప్రస్తావించి బహిష్కరించడం గమనార్హం.

సమావేశం ప్రారంభం కావడానికి ముందే చైర్మన్ ఎంపికపైనా, కమిటీ కూర్పుపైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు సభ్యులు (ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు) ఈ అంశాన్ని లేవనెత్తి వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్‌ను నిలదీశారు. ప్రతిపక్షానికే చైర్మన్ పోస్టు ఇచ్చామని స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. గతంలో అనుసరించిన సంప్రదాయాన్నే ఈసారి కూడా అమలు చేశామని నొక్కిచెప్పారు. కమిటీల కూర్పుపై స్పీకర్‌కు విచక్షణాధికారం ఉంటుందని వాదనల సందర్భంగా బదులిచ్చారు. గతంలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల సంఖ్యా బలంలో తేడాలున్నప్పటికీ చైర్మన్ ఎంపిక విషయంలో విపక్షాల నుంచి ఇదే తరహా అసంతృప్తి, ఆరోపణలు వచ్చాయని, అప్పటి స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న అంశాన్ని కూడా ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సైతం ప్రస్తుతం పీఏసీ చైర్మన్‌గా ఎంపికైన అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని, రికార్డులు కూడా అదే చెప్తున్నాయని, అందువల్లే ప్రతిపక్ష సభ్యుడికే అవకాశం ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు.

పీఏసీ ఫస్ట్ మీటింగును బహిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ.. 2018లో అతి పెద్ద విపక్ష పార్టీగా మజ్లిస్ పార్టీ ఉందని, అందువల్లే ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పీఏసీ చైర్మన్‌గా ఎంపికైన అరికెపూడి గాంధీ పేరును బీఆర్ఎస్ శాసనసభా పక్షం నామినేట్ చేయలేదని, పేరును కూడా ఇవ్వనప్పుడు ఆయనను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని, స్పీకర్‌ను కూడా ఇదే ప్రశ్నించామని ప్రశాంత్‌రెడ్డి మీడియాకు వివరించారు. హరీశ్‌రావు పేరును ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. 2014లో కాంగ్రెస్‌కు పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లేదని, అయినా ఆ పార్టీకి చెందిన కేసీ వేణుగోపాల్ పేరును అప్పటి స్పీకర్ ఖరారు చేశారని గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ సూచన మేరకే ఈ నిర్ణయం వెలువడిందని తెలిపారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో శ్రీధర్‌బాబుకు పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున రిక్వెస్ట్ రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.

ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో పీఏసీ పాత్ర ప్రజాస్వామికంగా చాలా కీలకమైనదని వివరించిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి.. ఖర్చవుతున్న ప్రతి రూపాయిని ప్రజల పక్షాన ఈ కమిటీ ఆడిట్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్‌కు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం రీత్యా ఐదుగురి పేర్లను పంపించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. ఈ వివాదంపై స్పీకర్ నుంచి సరైన సమాధానం రాకపోవడం అసంతృప్తి కలిగించిందని, ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనను గమనంలోకి తీసుకుని పీఏసీ చైర్మన్ నియామకంతో పాటు కూర్పుపై స్పీకర్ మరోసారి ఆలోచించాలని కోరారు. ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించి పొరపాటును సరిదిద్దుకోవాలన్నారు.


Similar News