మూసీపై ప్రభుత్వ ప్రతిపాదన అఖిలపక్షం ముందుంచాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

మూసీ నది ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన సమంజసంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు.

Update: 2024-10-18 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన సమంజసంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే మూసీ నదిపై ఒక నిర్ణయానికి వచ్చిందని, దాని అమలుకు సంబంధించిన సూచనలు మాత్రమే అడుగుతున్నదని తెలిపారు. మూసీ నది పునర్జీవం, దాని ప్రక్షాళన విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదని, ఆ పేరు మీద ప్రభుత్వం ఏమిచేయ తలపెట్టిందన్నదే అసలు విషయమన్నారు. ఇతర పార్టీల కార్యాచరణ ప్రణాళికలు అడగడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం చేయతలపెట్టిన ప్రాజెక్టు, దాని లక్ష్యాలు, ప్రణాళిక తదితర అంశాలతో కూడిన నిర్దిష్ట ప్రతిపాదన ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు.

అఖిలపక్ష సమావేశం ముందు ప్రభుత్వం ప్రతిపాదనను పెట్టి సలహాలు తీసుకోవడం సమంజసమని స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షాలు తమ సందేహాలను రాతపూర్వకంగా ఇస్తే, ప్రభుత్వ సమాధానం కూడా రాతపూర్వకంగా ఇస్తామంటున్నారని, ఇది అప్రజాస్వామిక ధోరణి అని తెలిపారు. ఏకపక్షంగా ప్రభుత్వమే ఒక నిర్ణయానికొచ్చి, దానిమీద సందేహాలు ఏమైనా ఉంటే అడగాలంటున్నారని, పైగా చర్చలు కాకుండా, లేఖల రూపంలో సమాధానం ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. ఈ ఏకపక్ష ధోరణి సరైంది కాదన్నారు. అందువల్ల ప్రభుత్వ ప్రతిపాదనను రాజకీయ పార్టీలకు అందజేసి, అధ్యయనానికి తగు సమయమిచ్చి, అఖిలపక్ష సమావేశం పిలవాలని సీపీఎం కోరుతున్నదని వెల్లడించారు.


Similar News