సనాతన ధర్మ పరిరక్షణకే జనసంచారంలోకి : మహిళా అఘోరి

Update: 2024-10-19 05:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా తెలంగాణలో సంచరిస్తు్న్న మహిళా అఘోరి(శివ విష్ణు బ్రహ్మ) తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా నాగసాధు అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ మహాదేవుడిని ధ్యానించారు. అంతకుముందు విగ్రహ ధ్వంసానికి గురైన సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడికి వచ్చిన అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమం చేసి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. ఒంటి కాలిపై నిలబడి పూజలు చేశారు.

తనను కలిసిన మీడియాతో మహిళా అఘోరి మాట్లాడుతూ తన విశేషాలను వెల్లడించారు. తన స్వస్థలం మంచిర్యాల అని, ఏడేళ్ళ వయసులో తన గురువు అఘోరి దీక్షను ఇవ్వడంతో హిమాలయాలకు వెళ్లిపోయానని, ప్రస్తుతం 27ఏళ్ళని, తాను 18శక్తి పీఠాలు, 12జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అఘోరి, నాగసాధు రెండు దీక్షలను తాను పూర్తి చేశానన్నారు.ఏండ్ల తరబడి హిమాలయాల్లో తపస్సులో ఉన్న తమకు అందరి మాదిరిగా చదువుకునే అవకాశం లేదని, అయితే దైవ కృపతో దేశంలోని ప్రముఖ భాషలను అర్ధం చేసుకోగలుతానని, మాట్లాడుతానని వెల్లడించారు. గురువు అనుమతితో సనాతన ధర్మ పరిరక్షణకు హిమాలయాల్లోని కేదారనాధ్, కైలాష్ పర్వతాలను వీడి జనసంచారంలోకి వచ్చి ఐదేళ్ళుగా దేశంలో పర్యటిస్తున్నానని తెలిపారు. మరో 25సంవత్సరాలు మాత్రం తన దేహం భూమిపై ఉంటుందని అప్పటిదాక సనాతన ధర్మ సంరక్షణకు పాటుపడుతానని తెలిపారు.

తన స్వస్థలం తెలంగాణలో పర్యటించడం ఆనందంగా ఉందని, శక్తి పీఠాల్లో జోగులాంబ అమ్మవారు ఈ ప్రాంతంలో ఉండటం గొప్ప విషయమన్నారు. తన తదుపరి పర్యటన గుజరాత్ లో కొనసాగుతుందన్నారు. సనాతన ధర్మం ప్రమాదంలో ఉన్నందునా అఘోరా, నాగసాధువులు తపస్సు నుంచి బయటకు వచ్చి దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, లోక కల్యాణం కోసం పర్యటిస్తున్నారన్నారు.  


Similar News