గిరిజన బాలికల కోసం పోషణమిత్ర

గిరిజన బాలికల కోసమే పోషణ మిత్ర పథకమని పంచాయతీ రాజ్, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.

Update: 2024-09-22 12:49 GMT

దిశ, ఉట్నూర్ : గిరిజన బాలికల కోసమే పోషణ మిత్ర పథకమని పంచాయతీ రాజ్, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం స్థానిక ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం పాల్గొన్నారు. వారికి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని 60 బాలికల ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన పోషణ మిత్ర పథకానికి ఐటీడీఏ పీఓ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

    గిరిజన విద్యార్థినుల్లో రక్తహీనత నివారణే ఈ పథక ముఖ్య ఉద్దేశమన్నారు. బాలికల్లో 6 శాతం కంటే తక్కువగా హెచ్బీ ఉంటే నెలసరి సమస్యలు అధికంగా ఉంటాయన్నారు. సీజనల్ గా లభించే పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీనాలని సూచించారు. చిన్నతనంలో తాను కూడా రక్తహీనతతో బాధపడ్డానని గుర్తు చేశారు. ఇంటి పరసరాల్లో సహజ సిద్దంగా కూరగాయలను పెంచుకోవాలన్నారు. రక్తహీనత నివారణలో భాగంగా బాలికలకు వారానికి రెండుసార్లు ఇప్పపువ్వు లడ్డూను అందిస్తున్నట్లు తెలపారు. సికిల్ సెల్ వ్యాధి నివారణకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆశ్రమ విద్యార్థినులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబోధన చేసి మంచి ర్యాంకులు సాధించేలా చూడాలన్నారు. అక్కడున్న ఇప్పపువ్వు స్టాల్​ను పరిశీలించి వారికి లడ్డూలను అందించారు.

పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకెళ్తా...

ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై నివేదికలు సిద్దం చేసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ పర్యటనలో భాగంగా శనివారం మండలానికి వచ్చిన మంత్రి సీతక్క రెండు రోజులు అక్కడే ఉన్నారు. శనివారం ఉమ్మడి గోండ్వాన, రాయిసెంటర్ల మేడీలతో సమావేశం నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో ఆదివాసీ పెద్దలు, ఆ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, ఉద్యోగ, ఉపాధి, ఐటీడీఏకు నిధుల మంజూరుపై ఆదివాసీ కుల సంఘాల నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

    అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఆదివాసీ పెద్దలు వారి సమస్యలు వివరించినట్టు తెలిపారు. గిరిజనులందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులు, సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. జైనూర్ ఘటనపై ప్రభుత్వం స్పందించి నిందితుడిని జైలుకు పంపించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, వెంకటేశ్ దోత్రి, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఎస్పీలు గౌస్ ఆలం, శ్రీనివాస్ రావు, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్, అధికారులు, ఆదివాసీ కులసంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News