దిశ ఎఫెక్ట్​... హబ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రితో పాటు దీని ఆవరణలో గల టీడీ హబ్ లో రక్త పరీక్షల రిపోర్టులపై అనుమానాలు అనే కథనంపై అధికారులు స్పందించారు.

Update: 2024-09-13 12:06 GMT

దిశ,ఆదిలాబాద్ : రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రితో పాటు దీని ఆవరణలో గల టీడీ హబ్ లో రక్త పరీక్షల రిపోర్టులపై అనుమానాలు అనే కథనంపై అధికారులు స్పందించారు. ఈ కథనం ఈనెల 10న దిశలో ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ రాజర్షి షా పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. హబ్ లో పనిచేస్తున్న అర్హత లేని ల్యాబ్ అటెండర్లతో పాటు,పేషంట్ కేర్ లను తొలగించాలని, అర్హత ఉన్న వారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయం రాష్ట్ర హెల్త్ కమిషనర్ దృష్టికి వెళ్లగా వారు డీఎంహెచ్ ఓ పరిధిలో పనిచేస్తున్న సీనియర్, అర్హత గల నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లను టీడీహబ్ కు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ,రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ హబ్ సెంటర్ ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

    దిశ కథనంలో వచ్చినట్లు గానే స్థానిక పరిస్థితి కనిపించడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ, రిమ్స్ డాక్టర్ జై సింగ్ రాథోడ్ మాట్లాడుతూ రిపోర్టుల్లో తప్పులు వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మేనేజర్ హరీష్ ను నిలదీశారు. ఒకేసారి ఒక్కొక్క పరికరంలో ఎన్ని పరీక్షలు చేస్తారని, ఎంత టైం లో రిపోర్ట్ లు వస్తాయని అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులు ఎవరు కలెక్ట్ చేస్తారని అడిగారు. ఇందుకు మేనేజర్ సమాధానం చెబుతూ మైక్రో బయాలజీ నుంచి ఒక వైద్యులు వస్తారని, ఉదయం 10 గంటలకు, సాయంత్రం వచ్చి రిపోర్టులు కలెక్ట్ చేస్తారని వివరించారు. సిబ్బంది ఎవరెవరు పని చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వారు ల్యాబ్ టెక్నీషియన్లు కాదని తేలడంతో ల్యాబ్ టెక్నీషియన్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అర్హత లేని ల్యాబ్ అటెండర్ల ద్వారా రక్త పరీక్షలు చేయించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. అధికారుల వెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, టీహబ్ మేనేజర్ హరీష్ తదితరులు ఉన్నారు. 

Tags:    

Similar News