Kodandaram : మంత్రివర్గంలో చోటు ఊహాగానాలే.. ఎమ్మెల్సీ కోదండరామ్ రియాక్ట్

రాష్ట్ర మంత్రివర్గంలో నాకు చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారమంటూ ఊహాగానాలు మాత్రమేనని ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పష్టం చేశారు.

Update: 2024-08-22 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గంలో నాకు చోటు కల్పించబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారమంటూ ఊహాగానాలు మాత్రమేనని ఎమ్మెల్సీ, టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్లో మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు. మంత్రి పదవిపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టంచేశారు. కానీ విస్తృతమైన పాత్ర పోషించాలని వారు కోరుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలు తెలపడానికి అవకాశమే ఉండేది కాదని, నిరసన కార్యక్రమాలు చేపడితే ముందస్తు అరెస్టులు, నిర్బంధాలతో అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఐక్య పోరాటాల ద్వారా నిరంకుశ పాలనను ఓడించుట కొరకు తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని మాట ఇచ్చిందని, అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ అని తెలిపారు. ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విషయం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.

రుణమాఫీ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. కొద్ది మంది రైతులకు రుణ మాఫీ జరగలేదన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు పంపిణీ జాప్యం వల్ల రుణ మాఫీలో ఇబ్బంది కలిగిందన్నారు. 12 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్ లు 2016 నుంచి పెండింగ్లో ఉన్నాయన్నారు. రుణ మాఫీ కానీ రైతులు అధైర్యపడోద్దని, త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం - తెలంగాణ తల్లి విగ్రహం మధ్య ఘర్షణ పెట్టవద్దన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ముఖ్య ద్వారం వద్ద పెట్టాలని ప్రభుత్వం ఆలోచన అని, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Tags:    

Similar News