స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

రాష్ట్రవ్యాప్తంగా "స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం చేసిందని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Update: 2024-10-07 11:58 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా "స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం చేసిందని ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ పండుగ‌ల‌కు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోందని, ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను తిప్పాల‌ని నిర్ణయించిందని తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 తేది వరకు అధిక రద్దీ ఉండే అవకాశముండటంతో.. ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతోందన్నారు. ద‌సరా ఆప‌రేష‌న్స్‌పై హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన పోలీస్, రవాణా శాఖ అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ద‌స‌రాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బ‌స్సులు, ర‌ద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చ‌ర్యలపై ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా ఆర్టీసీ అధికారులు వివ‌రించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నామన్నారు.

ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియ‌మించామని, ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారని వివరించారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియ‌మించామని, పండుగలకు ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్ళకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీకి స‌హ‌క‌రించాల‌ని పోలీస్, ర‌వాణా శాఖ‌ల అధికారుల‌ను సజ్జనార్ ప్రత్యేకంగా కోరారు. గ‌త‌ ద‌స‌రాతో పోల్చితే ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముంద‌ని, గతంలో మాదిరిగానే స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌ని ఆయన కోరారు. సంస్థ వృద్దిలో పోలీస్, రవాణా శాఖల పాత్ర సహకారం కూడా ఉంద‌ని అన్నారు.

ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌ర్యార్థం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు, త‌దిత‌ర ప్రాంతాల‌కు బ‌స్సుల‌ను నడిపేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలిపారు. ముఖ్యంగా జేబీఎస్ నుంచి 1602, ఎల్బీన‌గ‌ర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరాంఘ‌ర్ నుంచి 451 అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 13, 14 వ తేదీల్లోనూ ప్రత్యేక బ‌స్సులను ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులు సమయాన్ని వృథా చేసుకోకుండా బ‌స్సుల క‌ద‌లిక‌ల‌ను గుర్తించేందుకు గమ్యం ట్రాకింగ్ యాప్ ను వినియోగించుకోవాలన్నారు.

ఈ సమన్వయ సమావేశంలో హైదరాబాద్ సిటీ అదనపు కమిషనర్(ట్రాఫిక్) విశ్వప్రసాద్, సైబ‌రాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయ‌ల్ డేవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు రాహుల్ హెగ్డే, అశోక్ కుమార్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు శ్రీనివాసులు, మ‌నోహ‌ర్, ట్రాఫిక్ అదనపు డీసీపీలు వీర‌న్న, ఎండీ మాజిద్, రవాణా శాఖలకు చెందిన ఆర్టీఏలు వాణి, పురుషోత్తం రెడ్డి, సుభాష్ సి రెడ్డితో పాటు టీజీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, రంగారెడ్డి, హైద‌రాబాద్, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీల‌త‌, వ‌ర‌ప్ర‌సాద్, కేఎస్ ఖాన్, త‌దిత‌రులు పాల్గొన్నారు. 


Similar News