అది నాకు చాలా స్పెషల్ మూమెంట్ : విరాట్ కోహ్లీ

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.

Update: 2023-07-09 14:33 GMT

న్యూఢిల్లీ : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఆదివారం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. విండీస్ క్రికెట్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ముందు టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ బాదడం కరేబియన్ గడ్డపై తన ఫేవరెట్ మెమొరీ అని తెలిపాడు. ‘నా ఫేవరెట్ మెమొరీ ఆంటిగ్వా. సర్ వివియన్ రిచర్డ్స్ ముందు ఆంటిగ్వాలో టెస్టు క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ కొట్టాను.

సాయంత్రం ఆయన నన్ను కలిసి అభినందించారు. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్.’ అని తెలిపాడు. అలాగే, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో అనుబంధాన్ని కోహ్లీ వివరించాడు. ‘గేల్‌తో కలిసి చాలా ఏళ్లు ఆడాను. మేం జమైకాలో ఉంటే కచ్చితంగా అతన్ని కలుస్తాం. అతను భారత జట్టును తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఈ సారి కూడా మేము క్రిస్ గేల్‌ను కలుస్తాం. అతను చాలా మంచి వ్యక్తి.’ అని చెప్పాడు. కరేబియన్ గడ్డపై 9 టెస్టులు ఆడిన కోహ్లీ 35.61 సగటుతో 435 పరుగులు చేశాడు.


Similar News