అమెరికాకు బయల్దేరిన కోహ్లీ

Update: 2024-05-30 17:28 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌ కోసం టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ న్యూయార్క్‌కు బయల్దేరాడు. గురువారం ముంబై నుంచి అతను అమెరికాకు వెళ్లాడు. ముంబై ఎయిర్‌పోర్టులో అతను కనిపించగా.. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. విరాట్ మినహా మిగతా ఆటగాళ్లు ఇప్పటికే అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. రెండు బ్యాచ్‌లుగా టీమ్ ఇండియా ప్లేయర్లకు అక్కడికి వెళ్లారు.

తొలి బ్యాచ్‌లోనే కోహ్లీ న్యూయార్క్‌కు వెళ్లాల్సి ఉండగా.. అతను వెళ్లలేదు. రెండో బ్యాచ్‌ ఆటగాళ్లతో కూడా అతను కనిపించలేదు. దీంతో కోహ్లీకి ఏమైంది?. న్యూయార్క్‌కు ఎందుకు వెళ్లలేదు? అంటూ వార్తలు వచ్చాయి. అతను వెళ్లకపోవడానికి కారణమెంటో స్పష్టంగా తెలియదు.

అయితే, ఐపీఎల్ తర్వాత అతను విశ్రాంతి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే న్యూయార్క్‌కు ఆలస్యంగా వెళ్లేందుకు అతను బీసీసీఐ అనుమతి తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. శనివారం బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు విరాట్ అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. 


Similar News